ఐపిఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రాజీనామా: రాజకీయాల్లోకి అడుగు?

By telugu teamFirst Published Jul 19, 2021, 4:57 PM IST
Highlights

ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

హైదరాబాద్: ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఐపిఎస్ పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ కుమార్ రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.

తాను రాజీనామా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పనిచేయదలుచుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. 26 ఏళ్లు పాటు తన మాతృభూమికి ఐపిఎస్ అధికారిగా సేవ చేసినట్లు ఆయన తెలిపారు.

పేద ప్రజలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకిష్టమైన రీతీలో చేస్తానని ఆయన చెప్పారు. ఫూలే, అంబేడ్కర్ మార్గంలో నడుస్తానని ఆయన చెప్పారు. 

 

After 26 years of serving the motherland as an IPS officer, I have applied today for voluntary retirement to pursue my passion for social justice and equality with more vigour at my own pace. I thank you all for standing by me throughout my career.🙏🏼 pic.twitter.com/IZM9Jztimd

— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero)

ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ ఐపిఎస్ అాధికారి. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన తెలంగాణ సామాజిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యా సంసథల సొసెటీ కార్యదర్శిగా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఆయనను పలుమార్లు హిందూ సంస్థలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాయి. హిందూ దేవుళ్ల మీద ప్రమాణం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. బడుగు బలహీన వర్గాల సాధికారిత కోసం స్వీరోస్ అనే కొత్త ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

దళిత, బహుజన వర్గాలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. దాన్ని ప్రాతిపదికగా తీసుకునే ఆయన రాజకీయ పార్టీని స్థాపించడానికి హంగులు ఏర్పరచుకున్నట్లు చెబుతున్నారు.

 

click me!