
తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ (Indira Shoban) ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కొద్ది నెలల క్రితం వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గుడ్ బై చెప్పిన ఇందిరా శోభన.. ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (manish sisodia), ఆప్ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి (somnath bharti) సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. అవినీతికి తావులేని ఆప్ విధానాలు నచ్చి తాను పార్టీలో చేరినట్టుగా చెప్పారు. ఆమ్ ఆద్మీ సామాన్యుల పార్టీ అని.. పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను ఒక సామాన్య కుటుంబం నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టుగా చెప్పారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ఎదుర్కొనే ఏకైక వ్యక్తి ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అని అన్నారు. భవిష్యత్తులో చాలా మంది నేతులు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని అన్నారు. వైఎస్ షర్మిల పార్టీని తెలంగాణలో ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆప్ విధానాలు నచ్చే తాను పార్టీలో చేరినట్టుగా ఇందిరా శోభన్ చెప్పారు.
ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. అయితే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం తీరుతోనే తాను రాజీనామా చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ సమయంలో వైఎస్ షర్మిలతో భేటీ అయిన ఇందిరా శోభన్.. తాను తెలంగాణలో షర్మిల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. షర్మిల పార్టీ పెట్టకముందు నుంచే ఆమె వెంట నడించారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించారు.
వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభోత్సవంలో కూడా ఇందిరా శోభన్ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. షర్మిలతో కలిసి ముందుకు సాగారు. అయితే ఏమైందో తెలియదు గానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలు ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. తాజాగా ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.