అందరికీ శతృవయ్యా, 2023 వరకు పార్టీ వ్యవహరాలపై మాట్లాడను: జగ్గారెడ్డి

By narsimha lodeFirst Published Nov 3, 2021, 1:23 PM IST
Highlights

2023 ఎన్నికల వరకు పార్టీ వ్యవహరాలపై తాను స్పందించనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి వెళ్లేముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: 2023 ఎన్నికల వరకు పార్టీ అంతర్గత వ్యవహరాలపై తాను మాట్లాడబోనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం నాడు ఆయన గాంధీభవన్ లో  మీడియాతో మాట్లాడారు.ఉన్నది ఉన్నట్టు చెప్తే అందరికీ శతృవు అవుతున్నానని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితి గురించి బోస్ రాజు, Manickam Tagore కు ఏం తెలుసునని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

also read:ప్రారంభమైన కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ: హుజూరాబాద్‌ ఓటమిపై చర్చ

పార్టీ సమావేశంలోనూ, మీడియాలోనూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఇబ్బంది కలుగుతుందన్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో కొన్ని విషయాలపై తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి చెప్పారు. అయితే తాను ఏం మాట్లాడుతానో మాత్రం ఇప్పుడే చెప్పబోనన్నారు. పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి తాను  ఇవాళే పార్టీ నేతలతో చర్చిస్తానన్నారు.  భవిష్యత్తులో ఈ విషయాలపై తాను చర్చించబోనని హామీ ఇచ్చారు.  

మీడియాలో ఓ సెక్షన్ తనకు వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. ఒక్కఉప ఎన్నికతోనే  ఏమౌతోందని ఓ సెక్షన్ మీడియా తనను ప్రశ్నిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో నా సీటు ఎలా గెలిపించుకోవాలనే దానిపైనే శ్రద్ద పెడుతానన్నారు. రానున్న రోజుల్లో తాను సంగారెడ్డిలో గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.పార్టీ వ్యవహరాలపై మాట్లాడినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇస్తారో లేదో వాళ్లిష్టమని, ఈ విషయం తనకు తెలియదని జగ్గారెడ్డి చెప్పారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు వెళ్తేనే ఓట్లు పడలేదు. జగ్గారెడ్డిని చూసి ఓట్లు వేస్తారా అని ఆయన సెటైర్లు వేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ను రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు బలి పశువును చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తే రేవంత్ రెడ్డి ప్రతిభ, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోతే  సీనియర్ల తప్పిదమని రేవంత్ అనుచరులు ప్రచారానికి సిద్దమయ్యారని జగ్గారెడ్డి మంగళవారం నాడు వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కొందరు నేతలుఅభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యవహరం ఎఐసీసీ పరిధిలో ఉంటుంది.  దీంతో కొంత వెనక్కు తగ్గారనే ప్రచారం కూడ సాగుతోంది.

ఇవాళ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి ఆలస్యంగా వచ్చారు. మరో వైపు  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలపై పార్టీ నాయకత్వానికి నివేదిక ఇస్తానని ఆయన ప్రకటించారు. కానీ ఈ సమావేశానికి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు.రెండు తెలుగు రాష్ట్రాలను కేసీఆర్ కలిపితే తాను మద్దతిస్తానని జగ్గారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ జగ్గారెడ్డిని వివరణ కోరారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయవద్దని ఠాగూర్ కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిన విషయాన్ని ఠాగూర్ పార్టీ నేతలకు గుర్తు చేశారు. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయవద్దని కూడా ఠాగూర్ పార్టీ నేతలకు  సూచించారు.

click me!