కందుకూరు వరకు హైద‌రాబాద్ మెట్రో.. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభం.. : సీఎం కేసీఆర్

Published : Jun 20, 2023, 11:11 AM ISTUpdated : Jun 20, 2023, 11:15 AM IST
కందుకూరు వరకు హైద‌రాబాద్ మెట్రో.. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభం.. : సీఎం కేసీఆర్

సారాంశం

Hyderabad: హ‌రితహారం ఫేజ్-9 ప్రారంభం సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటామన్నారు. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనం, పిల్లల కోసం ఓపెన్ జిమ్ లు ఉండేలా అభివృద్ధి చేశామని తెలిపారు.  

Telangana chief minister K Chandrashekar Rao: హైదరాబాద్ మెట్రో రైల్ నెట్ వర్క్ ను విస్తరిస్తామనీ, రాష్ట్ర రాజధానిలోని మరిన్ని ప్రాంతాలను కలుపుతామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తూమ్మ‌లూరు గ్రామంలో హరితహారం ఫేజ్-9ను ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించడం త్వరలోనే సాకారమవుతుందనీ, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వరకు మెట్రో రైలు మార్గాల‌ను విస్తరిస్తామ‌ని తెలిపారు. కందుకూరు వరకు మెట్రో రైలును పొడిగించాలని విద్యాశాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆయన ఇది నిజమైన డిమాండ్ అని అభివర్ణించారు. అలాగే, బీహెచ్ఈఎల్ వరకు మెట్రో కనెక్టివిటీ తప్పనిసరి అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత ధీమా వ్యక్తం చేశారు. తుమ్మలూరులో హరితహారంలో భాగంగా మొక్కను నాటిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలుతో తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటామన్నారు. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనం, పిల్లల కోసం ఓపెన్ జిమ్ లు ఉండేలా అభివృద్ధి చేశామని తెలిపారు. పెరిగిన ఈ  పచ్చదనం సమిష్టి కృషి అన్నారు. గ్రీన్ డ్రైవ్ లో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎ.శాంతికుమారి)ని ఆదేశించారు.

ప్ర‌తిప‌క్షాల తీరువల్లే రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని ఆరోపించిన సీఎం త్వరలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్ నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణను అపహాస్యం చేసిన వారు, వ్యవసాయం ఎలా చేయాలో తెలియదన్న వారు  ఇప్పుడు ఏడో స్థానంలో ఉన్నారనీ, అయితే, తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయం, వరి ఉత్పత్తి, 24×7 విద్యుత్ సరఫరా తదితర సూచీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీతో పాటు తుమ్మ‌లూరు గ్రామపంచాయతీలో విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీకి రూ.25 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే