బంధువుల మహిళతో భర్త వివాహేతర సంబంధం... వేధింపులతో వివాహిత ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Jan 27, 2022, 12:43 PM IST
Highlights

భర్త మరో మహిళతో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో అతడికి దూరంగా వుంటున్నా వేధింపులకు గురిచేస్తుండటంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: క్షణికానందం కోసం వివాహేతర, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ చాలామంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. వీటి కారణంగా చాలా జీవితాలు చిన్నాభిన్నం అవడంతో పాటు నిండుప్రాణాలు బలవుతున్నాయి. ఇలాంటి దారుణమే తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) శివారులో చోటుచేసుకుంది.  

షహజా బేగం(25), షేక్ ఇమ్రాన్(29) దంపతులు ఇద్దరు సంతానంతో కలిసి రాజేంద్ర నగర్ (rajendranagar) ప్రాంతంలో నివాసముండేవారు. ఇమ్రాన్ స్థానికంగా ఓ హార్డ్ వేర్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇలా ఏలోటు లేకుండా ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో వివాహేతర సంబంధం నిప్పులు పోసింది.   

ఇమ్రాన్ కు దగ్గరి చుట్టాల్లోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్యకు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఏడాదిక్రితం భర్త ప్రియురాలితో ఏకాంతంగా వుండగా షహజా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

దీంతో భార్యపై కోపాన్ని పెంచుకున్న ఇమ్రాన్ ఆమె అడ్డుతొలగించుకుని ప్రియురాలితోనే వుండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య తాగే పాలలో క్రిమిసంహారక మందు కలిపి చంపడానికి ప్రయత్నించాడు. కానీ సమయానికి హాస్పిటల్ వెళ్లడంతో షహజా బేగం ప్రాణాలు దక్కాయి. 

భర్త నుండి ప్రాణహాని వుండటంతో ఇక కలిసి బ్రతకలేనంటూ షహజా విడాకులు తీసుకుంది. ఇలా భర్తకు దూరంగా ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో వుంటోంది. తోచిన పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను ఆలనా పాలనా చూసుకుంటోంది. 

అయితే దూరంగా వుంటున్నా భార్యపై కోపంతో రగిలిపోతున్న ఇమ్రాన్ ఆమెపై తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాడు. అంతేకాడు పిల్లలను తనకు ఇచ్చేయాలని వేధించసాగాడు. ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం  కొడుకును చూడటానికని వచ్చి బయటకు తీసుకెళ్లాడు. ఇప్పటివరకు కొడుకును తల్లికి అప్పగించలేదు. 

ఇలా విడాకులు తీసుకున్నా భర్త వేధింపులు మరీ మితిమీరిపోవడంతో తట్టుకోలేకపోయిన షహజా దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఉరితాడుకు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే మధ్యప్రదేశ్ లో ఇలాగే భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తెలిసి ఆ మహిళ తట్టుకోలేకపోయింది. నచ్చచెప్పి చూసినా లాభం లేకపోయింది. అలాగే.. జీవితాంతం భరిస్తూ ఎందుకు ఉండాలని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. భర్త స్నేహితుడితో రహస్యంగా కలిసింది. తన భర్తను హతమార్చాల్సిందిగా ఆదేశించింది. అందుకు రూ. 2 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. అందులో ఒక లక్ష ముందుగానే ఇచ్చుకుంది. డీల్ కుదిరిన మరుసటి రోజే భర్త హత్య జరిగింది. ఇలా భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న మహిళ భర్తనే చంపించింది.

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)
 

click me!