పెళ్లైన నాలుగు నెలలకు ఉరేసుకుని భార్య మృతి.. అదేచోట పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య...

By SumaBala BukkaFirst Published May 16, 2023, 10:59 AM IST
Highlights

భార్య మృతి తట్టుకోలేక ఆమె ఉరేసుకున్న చోటే ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన తెలంగాణలోని సిద్ధిపేటలో వెలుగు చూసింది. 

సిద్దిపేట : తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన నాలుగు నెలలకే ఓ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా… అదేచోట సరిగ్గా పెళ్లి రోజుకు ముందు భర్త కూడా  బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ ఈ విధంగా వివరాలు తెలియజేశారు. శ్యాంసుందర్ (35) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరుకు చెందిన వ్యక్తి. జానపద కళాకారుడు. 

హుస్నాబాద్ లోని గోదాం గడ్డ కాలనీకి చెందిన శారద అనే  యువతితో ఏడాది క్రితం శ్యాంసుందర్ పెళ్లి జరిగింది. కొద్ది రోజులపాటు భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పుట్టింటికి వచ్చింది శారద. అలా వచ్చిన శారద నిరుడు సెప్టెంబర్ 20న ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

అయితే అప్పటికే ఆమె మానసిక స్థితి సరిగాలేదని..  ఈ కారణంగానే ఈ దారుణానికి ఓడిగట్టి ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

భగ్గుమంటున్న ఎండలు.. తెలంగాణలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ వాసులకు అలర్ట్

ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్య మరణించడంతో శ్యాంసుందర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఆమె లేకుండా ఒంటరి జీవితం భరించలేకుండా ఉన్నానంటూ స్నేహితులతో.. కుటుంబ సభ్యులతో తరచూ చెబుతుండేవాడు. మే 15న వారి పెళ్లి రోజు. అంతకు ముందు రోజు మే 14వ తేదీన హుస్నాబాద్ లోని అత్తగారింటికి వెళ్లిన శ్యాంసుందర్.. ఆరోజు రాత్రి.. భార్య ఉరివేసుకున్న చెట్టు కిందనే పురుగుల మందు తాగి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ విషయం రాత్రి ఎవరూ గమనించలేదు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!