భారీ వర్షాల కారణంగా హిమాయత్సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ఇవాళ సాయంత్రం హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
హైదరాబాద్: జంట నగరాలకు మంచినీరు అందించే హిమాయత్ సాగర్ గేట్లను మంగళవారం నాడు సాయంత్రం అధికారులు ఎత్తనున్నారు. గత కొన్ని రోజులుగా నగరంతో పాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తాలని నీటిపారుదల శాఖాధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్టు గేట్లను ఒక్క అడగు వెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు.గత ఏడాది కూడ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కూడ హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుల చేశారు.హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తాలని నిర్ణయం తీసుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ నెల 21వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.తెలంగాణలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో హైద్రాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.