హరితహారంతో కరోనా పారిపోతుంది: మంత్రి మల్లారెడ్డి

By Sreeharsha GopaganiFirst Published Jun 20, 2020, 8:23 AM IST
Highlights

హరితహారంలో పాల్గొంటే... కరోనా వైరస్ పారిపోతుందని, అందుకని ప్రజలంతా స్వచ్ఛందముగా హరితహారంలో పాల్గొనాలని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. 

తెలంగాణ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, మాజీ ఎంపీ మల్లారెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హరితహారంలో పాల్గొంటే... కరోనా వైరస్ పారిపోతుందని, అందుకని ప్రజలంతా స్వచ్ఛందముగా హరితహారంలో పాల్గొనాలని అన్నారు. 

ఆయన హరిత హారం వల్ల కరోనా వైరస్ పారిపోతుందని చెప్పడంతో... సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డిపై జోకులు పేలుతున్నాయి. గతంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం మొన్నామధ్య మామ మల్లారెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు మల్లారెడ్డి వ్యాఖ్యలకు అల్లుడు రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను జతచేసి సోషల్ మీడియా లో క్రియేటివ్ గా ట్రోలింగ్ మొదలుపెట్టారు. అల్లుడు కేసీఆర్ ని దింపి మామను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే.... మామ ఏకంగా కరోనా ను తరిమికొట్టేపనిలో పడ్డాడు అని సెటైర్లు వేస్తున్నారు. 

ఇదిలా ఉండగా... తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 499 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,525కి చేరింది. ఇవాళ ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరుకుంది.

రాష్ట్రంలో 2,976 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,352 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్నట్లుగానే హైదరాబాద్‌లో 329 కేసులు నమోదవ్వగా, రంగారెడ్డిలో 129, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండలో నాలుగేసి చొప్పున, మహబూబ్‌నగర్ 6, జనగామ 7 కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో తాత్కాలిక సచివాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారినపడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి.

కరోనా భయంతో మిగిలిన శాఖల్లోనూ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవలే ఆర్ధిక శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడం లేదు.

అత్యవసరమైతే తప్పించి మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయం వైపు తొంగిచూడటం లేదు. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్‌ ఎంట్రన్స్ వద్ద  థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచుగా కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తున్నారు

click me!