కారణమిదే:గవర్నర్‌తో హాజీపూర్ బాధిత కుటుంబాల భేటీ

By narsimha lodeFirst Published Dec 16, 2019, 1:23 PM IST
Highlights

హాజీపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు సోమవారం నాడు తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. 

హైదరాబాద్: తమకు న్యాయం చేయాలని  కోరుతూ హాజీపూర్ లో శ్రీనివాస్ రెడ్డి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన బాధిత కుటుంబ సభ్యులు సోమవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను  కలిశారు. 

Also read: దిశకు న్యాయం చేశారు... మరి మా కూతుళ్లకు న్యాయమేది?

ఈ ఏడాది ఏప్రిల్  మాసం చివర్లో హాజీపూర్‌లో   మర్రి శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగు చూశాయి. ఒక్క హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి  విచారణ చేస్తే మిగిలినవారి హత్యల గురించిన విషయం వెలుగు చూసింది.

ఈ కేసును లోతుగా విచారణ చేసిన పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి  చేసిన హత్యల విషయం వెలుగు చూసింది. ఈ కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా జైలులో ఉన్నాడు.ఈ కేసులో ట్రయల్స్ వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసు విచారణను నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ చేస్తున్నారు. నల్గొండ పోలీసులు  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ట్రయల్స్ పూర్తి చేసి శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఈ నెల 6 వ తేదీన చటాన్‌పల్లి వద్ద దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడంతో తాము జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి కూడ ఇదే తరహాలో శిక్షను విధించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆందోళన కూడ చేశారు. హజీపూర్ తో పాటు సమతపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్యచేసిన నిందితులపై కూడ  ఇదే రకమైన శిక్షను విధించాలనే డిమాండ్ కూడ వచ్చింది.

ఈ తరుణంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ  హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు సోమవారం నాడు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి తమ గోడును వెల్లబోసుకొన్నారు.నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని గవర్నర్‌ ను బాధిత కుటుంబాలు కోరాయి.


 

click me!