
వరంగల్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. ఓ గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. దీంతో రైల్వే సిబ్బంది రైల్వే ట్రాక్కు మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఈ ఘటన వల్ల రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రిపేర్ పనులు జరుగుతన్నట్టుగా వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే గుజరాత్లోని దహోద్ జిల్లాలోని మంగళ్ మహుడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో సోమవారం ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల నుంచి వడోదర మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైల్వే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మంగళ్ మహుడిని దాటిన తర్వాత గూడ్స్ రైలు 16 కోచ్లు పట్టాలు తప్పాయి. కోచ్లు రెండు ట్రాక్లపై పడిపోయాయి. కొన్ని కోచ్లు ఒకదానిపై పడిపోయాయి. సోమవారం సాయంత్రానికి రైల్వే శాఖ 51 రైళ్లను దారి మళ్లించగా, మరో 38 రైళ్లను రద్దు చేసింది.
రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్తో పాటు విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. ఘటన తీవ్రత దృష్ట్యా రైలు రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు కొంత సమయం పట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గూడ్స్ రైలులోని ఎనిమిది కోచ్లను పట్టాల నుంచి తొలగించామని, మిగిలినవి త్వరలో తొలగిస్తామని అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు.