
తెలంగాణలోని ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. ఉద్యోగులు, పెన్షనర్ల ఇచ్చే అలవెన్స్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విభాగాల వారీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు.. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు అలవెన్సులు, ప్రయోజనాలను పెంచిందని పేర్కొన్నారు.
ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం పెంచింది. అలాగే బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంచింది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30 శాతం పెంచింది.
దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 80 వేల నుంచి రూ. లక్షకు పెంచింది.
ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి.. కూతురు పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. లక్ష నుంచి రూ. 4 లక్షలు, కొడుకు పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75 వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెంచింది. పెన్షనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం 20 వేల నుంచి 30 వేలకు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడీ, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్పెషల్ పే మంజూరు చేసింది.