హైదరాబాద్ ర్యాంక్ తగ్గింపు.. రాజకీయ దురుద్దేశమే: మేయర్ గద్వాల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 05, 2021, 09:17 PM IST
హైదరాబాద్ ర్యాంక్ తగ్గింపు.. రాజకీయ దురుద్దేశమే: మేయర్ గద్వాల వ్యాఖ్యలు

సారాంశం

కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (ఈవోఎల్ఐ), మున్సిపల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఎంపీఐ) 2020లపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ విమర్శలు కురిపించారు. హైదరాబాద్ నగర ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్‌ ఇచ్చిందని ఆమె ఆరోపించారు

కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ (ఈవోఎల్ఐ), మున్సిపల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఎంపీఐ) 2020లపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ విమర్శలు కురిపించారు.

హైదరాబాద్ నగర ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్‌ ఇచ్చిందని ఆమె ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే సులభతర జీవనంలో హైదరాబాద్‌ ర్యాంకింగ్‌ను తగ్గించారని విజయలక్ష్మీ మండిపడ్డారు.

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి 24వ స్థానం ప్రకటించడం సరికాదన్నారు. ముత్యాల నగరంగా పేరుపొందిన హైదరాబాద్‌.. అభివృద్ధిలో దేశంలోని అన్ని నగరాల కంటే ముందు దూసుకెళ్తోందని మేయర్ గుర్తుచేశారు. ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రామాణాలు హైదరాబాద్‌కు ఉన్నాయన్న విజయలక్ష్మీ.. 24వ ర్యాంకు ప్రకటించడాన్ని హైదరాబాదీలు అంగీకరించరని స్పష్టం చేశారు. 

కాగా, దేశంలో నివాసయోగ్య నగరాల్లో కర్ణాటక రాజధాని, దేశ ఐటీ రాజధాని బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ సూచీ జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

మొత్తం 111 నగరాలతో ఈ జాబితా రూపొందించగా.. బెంగళూరు తొలి స్థానం నిలిచింది. ఆ తర్వాత పుణె, అహ్మదాబాద్‌, చెన్నై, సూరత్‌, నవీముంబయి, కోయంబత్తూర్‌, వడోదర, ఇండోర్‌, గ్రేటర్‌ ముంబయి టాప్‌ 10లో ఉన్నాయి.   

జనాభాను బట్టి ఈ జాబితాను రెండుగా విభజించారు. 10 లక్షల పైన జనాభా కలిగిన 49 నగరాల్లో బెంగళూరు టాప్‌లో ఉండగా.. మిలియన్‌ లోపు జనాభా కలిగిన 62 నగరాల్లో హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లా అగ్రస్థానంలో నిలిచింది.

చిన్న నగరాల్లో సిమ్లా తర్వాత భువనేశ్వర్‌, సిల్వస్సా, కాకినాడ, సేలం, వెల్లూరు, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, దావణగిరె, తిరుచిరాపల్లి టాప్‌ 10 ర్యాంకింగ్‌లు దక్కించుకున్నాయి.  ఇక ‘మున్సిపల్‌ పర్ఫామెన్స్‌ ఇండెక్స్‌’ మిలియన్‌ ప్లస్‌ జనాభా కేటగిరిలో ఇండోర్‌ అగ్రస్థానంలో ఉండగా.. పది లక్షల లోపు జనాభా కేటగిరిలో ఢిల్లీ టాప్‌గా నిలిచింది.

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. నగరాల్లో ప్రజలు జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులను పరిగణనలోనికి అధ్యయనం చేసిన కేంద్రం తాజాగా ఈ ర్యాంకులను కేటాయించింది.   

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu