తమ పార్టీ ఓటమికి కాంగ్రెసు నేత, ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాను నిందించారు. మీడియా కారణంగానే కాంగ్రెసు ఓటమి పాలైందని ఆయన ఆడిపోసుకున్నారు. బిజెపి, టీఆర్ఎస్ మీడియాను మేనేజ్ చేశాయని విమర్శించారు.
హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాను నిందించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ కేవలం రెండు స్తానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనూహ్యంగా బిజెపి తన సత్తా చాటింది. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి మీడియాపై నిందలు వేశారు.
బిజెపి, టీఆర్ఎస్ మీడియాను మేనేజ్ చేశాయని ఆయన విమర్శించారు. మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమికి మీడియానే కారణమని ఆయన అన్నారు.
కాంగ్రెసు ఓటమికి ఓటర్లు కారణం కాదని, మీడియా కారణమని ఆయన అన్నారు. ప్యాకేజీలతో టీఆర్ఎస్, బిజెపి మీడియాను మేనేజ్ చేశాయని అన్నారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రచారం చేసఆరని ఆయన గుర్తు చేసారు కష్టకాలంలో కాంగ్రెసు జెండాను మోసిన కార్యకర్తలను ఆయన అభినందించారు.
టీఆర్ఎస్ కు, ఎంఐఎంకు బిజెపి జిహిచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెసు నామమాత్రంగా మిగిలిపోయింది. టీడీపీ తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. టీఆర్ఎస్ గతంలో కన్నా చాలా తక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంది.