వనపర్తి సాముహిక మరణాలు: గుప్త నిధి తవ్వకాలు.. నురుగలు కక్కుకొని..

By telugu news teamFirst Published Aug 15, 2020, 8:54 AM IST
Highlights

ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలకు గురువారం ముహూర్తం పెట్టుకున్నారు. బుధవారం భార్య ఆస్మ, కూతురు ఆష్రిన్‌తో కలిసి ఖాజాపాషా నాగర్‌కర్నూలు నుంచి నాగపూర్‌లోని అత్తగారి ఇంటికి చేరుకున్నాడు.

గుప్త నిధి తవ్వాలు చేపట్టాలని ఆ ఇంట్లోని కుటుంబసభ్యులంతా భావించారు. అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా.. ఆ ఇంట్లోని సభ్యులంతా శవాలయ్యారు. అయితే.. వారంతా నోట్లో నురగలు కక్కుకొని మరీ ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరి శవం ఒక్కో చోట పడి ఉంది. వారి తలల వద్ద కొబ్బరికాయలు, పసుపు, పూలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఈ సంఘటన వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన హజీరాబేగం, రహీం దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు కరీంపాష ఉన్నారు. ఆర్‌ఎంపీ వైద్యుడిగా యునానీ మందులు ఇచ్చే రహీం కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా చనిపోయాడు. అప్పటికే ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కూతుళ్లు నాగర్‌కర్నూలులో, చిన్నకూతురు హైదరాబాద్‌లో ఉం టున్నారు. కుమారుడు కరీంపాష, నాగర్‌కర్నూలులోనే ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. అయితే, తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ దేవుడు కలలోకి వచ్చి చెప్పాడంటూ ఆరేళ్ల క్రితం తన కూతుళ్లు, అల్లుళ్లకు హజీరాబేగం చెప్పింది.

అయితే ఇంట్లో ఎలాంటి తవ్వకాలు చేపటొద్దని కుటుంబసభ్యులు, బంధువులు గట్టి గా చెప్పడంతో ఆ ఆలోచనను ఆమె విరమించుకుంది. రెండో కూతురు ఆస్మ, అల్లుడు ఖాజాపాషా మాత్రం నిధులు దొరికితే పేదరికం నుంచి బయటపడి మంచిగా బతకొచ్చని ఆశపడ్డారు. 

ఇంట్లో గుప్త నిధుల తవ్వకాలకు గురువారం ముహూర్తం పెట్టుకున్నారు. బుధవారం భార్య ఆస్మ, కూతురు ఆష్రిన్‌తో కలిసి ఖాజాపాషా నాగర్‌కర్నూలు నుంచి నాగపూర్‌లోని అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లు స్విచాఫ్‌ చేసుకున్నారు. శుక్రవారం యూసుఫ్‌ అనే వారి బంధువు ఇంటికి వెళ్లగా అక్కడ నలుగురూ విగతజీవులుగా కనిపించారు. హాల్లో ఆస్మ, వంటగదిలో హజీరా, పడకగదిలో ఆష్రిన్‌ మృతదేహాలు కనిపించాయి. ఇంటి వెనకాల తవ్విన గుంత వద్ద ఖాజాపాషా మృతదేహం పడివుంది.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను రేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. ఆ నివేదికలో మృతదేహాల్లో విషం ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. అయితే వారు తమకు తామే విషం తీసుకున్నారా? బలవంతంగా ఎవరైనా తాగించారా? అనేది ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుందని పోలీసులు తెలిపారు. 

click me!