రాజకీయాల నుండి తప్పుకొంటా: ఎర్రబల్లి దయాకర్ రావు సంచలనం

By narsimha lodeFirst Published Sep 10, 2018, 1:35 PM IST
Highlights

అసమ్మతి తనకు  కొత్త కాదని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే   ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పార్టీ కోసం కష్టపడినవారు టిక్కెట్టు దక్కకపోవడంతో నిరాశ చెందడంలో తప్పు లేదన్నారు.


వరంగల్: అసమ్మతి తనకు  కొత్త కాదని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే   ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పార్టీ కోసం కష్టపడినవారు టిక్కెట్టు దక్కకపోవడంతో నిరాశ చెందడంలో తప్పు లేదన్నారు.  టిక్కెట్టు రాకపోవడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన  పార్టీ నేతలకు సూచించారు.

దయాకర్‌రావుతో ఓ తెలుగు న్యూస్ ఛానెల్  సోమవారం నాడు ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్న సమయంలోనూ, టీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడ తనకు అసమ్మతి ఉందన్నారు. అసమ్మతి అనేది తనకు కొత్త కాదన్నారు.

తాను టీడీపీలో ఉన్న కాలంలో పాలకుర్తిలో టిక్కెట్టు  విషయమై 2009లో సుధాకర్ రావును  ఇతరులను కూడ ఒప్పించి  పోటీ చేసి విజయం సాధించినట్టు  చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో కూడ తనకు అసమ్మతిని  కూడ  తట్టుకొని విజయం సాధించినట్టు చెప్పారు.

తాజాగా టీఆర్ఎస్‌లో కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు దక్కనివారు కూడ  నిరాశ చెందడం సహాజమేనని ఆయన చెప్పారు. అయితే టిక్కెట్టు రాకపోవడంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

టిక్కెట్టు ఆశించిన వారికి పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా ఆదుకొంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్న కాలంలో రెండు దఫాలు తనకు టిక్కెట్టు రాలేదన్నారు. బీజేపీకి తన స్థానాన్ని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని  కూడ  కోరినా తాను  పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

టీడీపీలో తనకు మంత్రి పదవి రాకున్నా తాను బాధపడలేదన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తును ప్రజలు విశ్వసించబోరని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. వేలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకొంటేనే కాంగ్రెస్ పార్టీ  తెలంగాణను ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇవ్వకుండా చంపినవాళ్లే అమరులస్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తున్నారని చెప్పారు.

కేసీఆర్ తో పాటే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. కేసీఆర్ చెప్పినట్టు తాను నడుచుకొంటానని ఆయన చెప్పారు.  2024 తర్వాత రాజకీయాల నుండి తాను తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. కుటుంబసభ్యులతో గడిపేందుకే తాను  ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టు చెప్పారు.

click me!