నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు: ఆడిటర్లతో భేటీకి ఢిల్లీకి

By narsimha lodeFirst Published Sep 30, 2022, 11:34 AM IST
Highlights

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఐదుగురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఆడిటర్లతో  కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. 


హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఐదుగురు తెలంగాణ  కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈడీ విచారణకు ముందే పార్టీ ముఖ్యులతో పాటు ఆడిటర్లతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.ఈ నెల 11, 12 తేదీల్లో విచారణకు రావాలని తెలంగాణకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలకు   ఈడీ అధికారులు నోటీసులు పంపారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లకు  ఈడీ నోటీసులు జారీ చేసింది. 

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఈ ఐదుగురికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈడీ విచారణకు ముందే పార్టీ ఆడిటర్లతో ఈ ఐదుగురు సమావేశం కానున్నారు. పార్టీ అధినాయకత్వం సూచన మేరకు ఐదుగురు కాంగ్రెస్ నేతలు  ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి కొందరు , ఇవాళ ఉదయం కొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఎఐసీసీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు ఆడిటర్లతో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.

ఈ నెల 23 వ తేదీనే కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తమకు నోటీసులు రాలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లు ప్రకటించారు. నోటీసులు అందితే సమాధానం ఇస్తామని ప్రకటించారు.  నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళం ఇచ్చినట్టుగా  మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లు ఒప్పుకున్న విషయం తెలిసిందే. 

నేషనల్ హెరాల్డ్  కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల విచారణ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈ ఏడాది జూలై మాసంలో  ఈడీ అధికారులు విచారించారు.అంతకు ముందు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు సుమారు 50 గంటలకు పైగా ప్రశ్నించారు.  యంగ్ ఇండియన్ కంపెనీ కూడా ఏజేఎల్ యొక్క ఆస్తులలో రూ. 800 కోట్లకు పైగా తీసుకుందని ఈడీ  పేర్కొంది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణను ప్రారంభించారు.

alsoread:ఈడీ పేరిట వేధింపులు: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ఈ ఏడాది ఆగస్టు 3 వ తేదీన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. 
అంతకు ముందు రోజే ఢిల్లీలోని నేషనల్  హెరాల్డ్ కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు చేశారు. 
 

click me!