Omicron in Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు.. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి నిర్దారణ

By Sumanth KanukulaFirst Published Dec 21, 2021, 10:13 AM IST
Highlights

తెలంగాణలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla district) తొలి Omicron కేసు నమోదైంది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్టుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కూడా క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla district) తొలి Omicron కేసు నమోదైంది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్టుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు తెలిపారు. అతను ఇటీవల దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చినట్టుగా చెప్పారు. వివరాలు.. గూడెం గ్రామానికి 26 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈ నెల 16న అతడు తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. 

అయితే అతడు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోకి చేరుకున్నాక అధికారులు ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. సోమవారం అతనికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా తేలింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు సోమవారం సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావుతో పాటు పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంజీవరెడ్డి.. ఇతర వైద్య సిబ్బంది వెంటనే గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంటనే వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆస్పత్రికి (KIMS Hospital) తరలించారు. 

తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు వైద్యాధికారులు.. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఇంటికి చేరాక ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్‌ చేశారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో పాటుగా దుబాయ్ నుంచి వచ్చిన చిప్పలపల్లికి చెందిన మరో వ్యక్తి ఇంటిని కూడా క్వారంటైన్‌ చేశారు. గూడెం గ్రామ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఇక, తాజా కేసుతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. 

Also read: Omicron: ఇక నుంచి గాంధీ హాస్పిటల్‌లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్.. ఒమిక్రాన్ నిర్ధారణ

నలుగురి పరిస్థితి సీరియస్..!
ఇదిలా ఉంటే విదేశాల నుంచి తెలంగాణకు చేరుకున్న ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందికి Omicron నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే వారిలో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు నలుగురు కూడా విదేశీయులేనని.. సోమాలియా, కెన్యాకు చెందినవారు. ట్రీట్‌మెంట్ కోసం వారు హైదరాబాద్‌కు వచ్చే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే వారిని గాంధీ, గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి మాత్రం ఆందోళకరంగా ఉన్నట్టుగా సమాచారం.  

ఇక, ఎట్ రిస్క్ దేశాల నుంచి  సోమవారం 658 మంది ప్రయాణికులు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

click me!