
ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. సుఖేష్ను అరెస్ట్ చేశామని.. అతని షోరూంలలో రూ.149 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. కోటీ 96 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. 2019 ఎంఎంటీఎస్లో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఈ సోదాలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో రెండ్రోజులు సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. రూ.504 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు జరిపినట్లు పేర్కొంది. గతంలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ ఇచ్చి విఫలమయ్యారు సుఖేష్. అతనికి చెందిన ఎంబీఎస్, ముసద్దీలాల్లో సోదాలు పూర్తి చేసినట్లు పేర్కొంది. కేంద్రం ఆధీనంలో నడిచే ఎంఎంటీసీని సుఖేష్ గుప్తా పెద్ద మొత్తంలో ముంచారని ఈడీ అభియోగాలు మోపింది.
Also REad:ఎంబీఎస్ ఎండీ సుఖేష్ గుప్తా కస్టడీ:కోర్టులో ఈడీ పిటిషన్
కాగా.. ఎంబీఎస్ సంస్థపై ఎంఎంటీసీ సంస్థ ఇచ్చిన పిర్యాదుతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సుఖేష్ గుప్తాపై ఫెమా, పీఎంఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఎంఎంటీసీ సంస్థ నుండి రూ. 500 కోట్ల విలువైన బంగారాన్ని ఎంబీఎస్ సంస్థ కొనుగోలు చేసింది. క్రెడిట్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే ఈ బంగారానికి సంబంధించి డబ్బులు ఎంబీఎస్ సంస్థ చెల్లించలేదు. ఎంఎంటీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2014లో సీబీఐ అధికారులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఆరు కేసుల్లో సుఖేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పెద్ద నగదు నోట్ల రద్దు సయంలో సుఖేష్ గుప్తా అక్రమాలకు పాల్పడినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తప్పుడు పత్రాలు సృష్టించి నగదును మార్పిడి చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.