
woman dies after being attacked by monkeys: ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని కోతులతో కూడిన గుంపు వృద్దురాలిపై దాడి చేశాయి. ఈ ఘటనతో వృద్దురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. కోతుల గుంపు దాడిలో 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలిని చత్రబోయిన నర్సవ్వగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రామారెడ్డి గ్రామంలో నివాసముంటున్న నర్సవ్వ తన కుమార్తెతో పెళ్లికి వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె వాష్ రూమ్ కు వెళ్తుండగా కొన్ని కోతులు దాడి చేశాయి. ఈ కోతుల గుంపు నుంచి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె జారి పడి తల నేలకు తగిలి గాయాలపాలైంది. అయినప్పటికీ ఆమెను విడిచిపెట్టకుండా కోతులు దాడి చేశాయి. కొద్ది సమయం తర్వాత వెళ్లిపోయాయి.
కోతులు దాడి చేస్తున్న సమయంలో ఆమె సాయం కోసం అరవగా.. కోతులు తమపై దాడి చేస్తాయనే భయంతో చుట్టుపక్కల వారు ఏవరూ వెళ్లలేదని సమాచారం. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పెండ్లికి వెళ్లిన తన కుమార్తె వచ్చి చూడగా.. ఆమె తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయాలు పెద్దగా కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, "కోతులు ఆమెపై దాడి చేయడంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించిందనీ, ఈ క్రమంలో ఆమె జారి కిందపడిందని, తలకు గాయమై చనిపోయిందని స్థానికుల ద్వారా మాకు తెలిసింది" అని నర్సవ్వ ఘటన గురించి రామారెడ్డి పోలీసులు తెలిపారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు లేనందున ఎఫ్ఐఆర్ నమోదు చేయబడలేదు. కుటుంబ సభ్యులు నర్సవ్వకు అంత్యక్రియలు చేశారు. అయితే, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి.