ఈటల రాజేందర్ ఎఫెక్ట్: హుజూరాబాద్ లో బిజెపికి కార్యకర్తల షాక్

By telugu teamFirst Published Jun 27, 2021, 8:13 AM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిన ప్రతికూల ప్రభావం బిజెపిపై పడింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతుకుంట మండలానికి చెందిన దాదాపు 200 మంది బిజెపికి రాజీనామాలు చేశారు.

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక బిజెపికి హుజూరాబాద్ నియోజకవర్గంలో బిజెపికి పెద్ద ఎదురు దెబ్బనే తగిలింది. రెండు వందల మందికి పైగా కార్యకర్తలు బిజెపికి రాజీనామా చేశారు. తన సంపందను, ఆస్తులను కాపాడుకోవడానికి, కేసుల నుంచి బయటపడడానికి ఈటల రాజేందర్ పార్టీలో చేరారని బిజెపి ఇల్లంతుకుంట మండలం అధ్యక్షుడు రవి యాదవ్ శనివారంనాడు ఆరోపిచారు. 

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతుకుంటకు చెందిన 200 మందికిపైగా బిజెపి కార్యకర్తలు మల్యాల గ్రామంలో జరిగిన సమావేశంలో పార్టీకి రాజీనామా చేశారు.  పార్టీ ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, స్థానిక ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉదాత్త రత్నాకర్, బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి తిరుపతి యాదవ్, యువ మోర్చా మండలాధ్యక్షుడు గుత్తికొండ పవన్ బిజెపికి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. 

తమ భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని రవి యాదవ్ చెప్పారు. గత 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎనలేని సంపదను కూడగట్టుకున్నారని ఆయన ఆరోపించారు. చెట్లు నరుకుతూ, అడవులను నరుకుతూ, అసెన్డ్ భూములను అక్రమిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. 

నీతినిజాయితీలను నిరూపించుకోవాలంటే ఆరు ఎకరాల దేవాదాయ భూముల అక్రమణపై ముందుకు రావాలని ఆయన ఈటల రాజేందర్ ను డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని మంత్రిగా ఉన్నప్పుడు వెళ్తే ఈటల రాజేందర్ బలహీనవర్గాలవారిని అవమానించారని ఆయన విమర్శించారు. అగ్రవర్ణాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. 

బలహీనవర్గాల భూములను అక్రమించుకుంటూ అగ్రవర్ణాలవారికి మద్దతు ఇస్తూ ఈటల రాజేందర్ పనిచేశారని ఆయన ఆరోిపంచారు. ఇప్పుడు వెనకబడిన వర్గాల, ముదిరాజ్ సామాజిక వర్గం సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 

రాజేందర్ గురించి ప్రజలకు అర్థమైందని,  ఆయన రాజకీయ ఎత్తుగడలకు వారు పడిపోయే పరిస్థితి లేదని, హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్తారని రవి యాదవ్ అన్నారు.

click me!