హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరం... పోటీలో ఈటల సతీమణి జమున?

By Arun Kumar PFirst Published Jul 18, 2021, 1:01 PM IST
Highlights

హుజురాబాద్ లో మరికొద్దిరోజుల్లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కరీంనగర్: హుజురాబాద్ నియోజకర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉపఎన్నికలో తాను పోటీ చేసినా, తన భర్త ఈటల రాజేందర్ పోటీ చేసిన ఒక్కటేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో  రాజేందర్ ను ముందుండి నడిపించింది తానేనంటూ ఈటల జమున పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు  రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 

''మా ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తారు. అది ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే మాలో ఎవరు పోటీ చేసినా పార్టీ మాత్రం మారదు'' అంటూ హుజురాబాద్ ఉపఎన్నికపై ఈటల సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

వీడియో

ఇదిలావుంటే ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సమావేశానంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.... ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలుద్దామనుకున్నామన్నారు.  అయితే ఆరోజు కుదరకపోవడం వల్ల సమయం తీసుకుని ఈరోజు ఢిల్లీకి వచ్చి కలిశామని వెల్లడించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని సర్వే రిపోర్టులు వచ్చాయని సంజయ్ తెలిపారు. 

read more ఆకలినైనా భరిస్తాం... ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోం, చిల్లరదాడులకు భయపడేది లేదు: ఈటల
 
తెలంగాణలో నిర్వహించబోయే బహిరంగసభకు వస్తానని అమిత్ షా తమతో చెప్పారని బండి సంజయ్ వెల్లడించారు. అదే విధంగా తాము చేపట్టబోతున్న పాదయాత్రకు కూడా ఆయనను ఆహ్వానించామన్నారు. ఆగస్టు 9వ తేదీన తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని సంజయ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉపఎన్నిక గురించి టీఆర్ఎస్ భయపడుతోందని... వారికి ప్రస్తుతం అభ్యర్థి కూడా దొరకడం లేదని సంజయ్ ఎద్దేవా చేశారు. 

టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా ఓటర్లు తీసుకోవాలని... ఎందుకంటే వాళ్లు పంచేది అవినీతి సొమ్మంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో అవినీతి, అరాచక, అక్రమ పాలనను అంతం చేయడానికే పాదయాత్రను చేపడుతున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. 
 

click me!