దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి.. దానిని ఎదుర్కొంటున్న తనకు మధ్య పోరు అని ఈటల అభివర్ణించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఆయన బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని ధర్మారం, శాయంపేట గ్రామాల్లో ఈటల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కు బుద్ధి చెప్పాలని హుజూరాబాద్ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఈటల విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి.. దానిని ఎదుర్కొంటున్న తనకు మధ్య పోరు అని ఈటల అభివర్ణించారు.
మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంట బిజెపిలోకి వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. ఇప్పుడు బిజెపి నాయకులను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ఈటలను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మూడెత్తుల మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు.
Also Read:ఈటలకు బిగ్ షాక్... బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి రాజీనామా, టీఆర్ఎస్ లో చేరిక
ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ హుజురాబాద్ బిజెపిలో కీలక నాయకుడు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో మల్లేష్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.