చాలా సేపు భూమి కంపించి.. ఇళ్లు కదిలాయని స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి 1.30 గంటలకు మొదలై బుధవారం తెల్లవారుజామున 4గంటల వరకు పలుమార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి భూకంపం సంభవించింది. ఇటీవల కొద్దిరోజుల క్రితం బోరబండలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం కూడా భారీ శబ్దాలతో కూడిన భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజలు భయంతో వణికిపోయారు.
గచ్చిబౌలి టీఎన్జీఓఎస్ కాలనీతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లో మంగళవారం రాత్రి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చాలా సేపు భూమి కంపించి.. ఇళ్లు కదిలాయని స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి 1.30 గంటలకు మొదలై బుధవారం తెల్లవారుజామున 4గంటల వరకు పలుమార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
తిరిగి బుధవారం మధ్యాహ్నం 2గంటల నుంచి గంటకోసారి భారీ శబ్దాలతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని వారు చెప్పారు. బుధవారం రాత్రి పెద్ద స్థాయిలో శబ్దాలు రావడంతో కాలనీవాసులంతా భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. స్థానికుల ఫిర్యాదుతో శేరిలింగంపల్లి ఉప కమిషనర్ వెంకన్న ఘటనాస్థలికి చేరుకున్నారు. కాలనీవాసులతో మాట్లాడి డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతున్నామని.. నిపుణులతో మాట్లాడి కారణం తెలుసుకుంటామని భరోసా ఇచ్చారు.