దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం బీజేపీ హైకమాండ్పై రగిలిపోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేదా జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి హోదా కావాలంటున్నారని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ బీజేపీలో అసమ్మతి నానాటికి తీవ్రమవుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అసహనంతో వుండటంతో వారిని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఈ గొడవ సద్దుమణిగేలోగా.. ఉదయం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన దున్నపోతు వీడియో మరోసారి రాష్ట్ర బీజేపీలో ఏదో జరుగుతోందోనన్న అనుమానాన్ని కలిగించింది. తాజాగా మరో సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం హైకమాండ్పై రగిలిపోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అసలు దుబ్బాకలో తాను గెలిచిన తర్వాతే తెలంగాణలో బీజేపీకి ఊపిరి వచ్చిందని రఘునందన్ రావు అంటున్నట్లుగా తెలుస్తోంది. తనకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేదా జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి హోదా కావాలంటున్నారని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈటల, రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడిన హైకమాండ్ తనను పట్టించుకోకపోవడం ఏంటని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అలాగే బండి సంజయ్ , ఈటల రాజేందర్లకు వై కేటగిరి భద్రత కల్పించడంపైనా ఆయన అసహనంతో వున్నారట. ఇప్పటికే రెండు నెలల నుంచి రఘునందన్ రావు బీజేపీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా అసంతృప్తిని బయటపెట్టడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమైందని తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.