నగరంలోని జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.
తెలంగాణ అదనపు డీజీ రవి గుప్తా, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఇళ్లపై గురువారం నాడు ఉదయం డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది.
ఈ కెమెరాను గుర్తించిన ఓ ఐపీఎస్ అధికారి భార్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు.
పోలీసు అధికారుల ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఈ డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రోన్ కెమెరాను జూబ్లీహిల్స్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. డ్రోన్ కెమెరాను ఎందుకు ఉపయోగించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన పోలీస్ అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా సంచరించడం కలకలం రేపుతోంది. ఈ కెమెరా ద్వారా ఏ ఏ ఫోటోలు సేకరించారు. ఎందుకు సేకరించారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.