మేడారంలో భక్తుల రద్దీ.. సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు

By Siva KodatiFirst Published Feb 21, 2021, 4:34 PM IST
Highlights

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర నేపథ్యంలో భక్తులు మేడారానికి పోటెత్తారు. వారాంతం కావడంతో కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చారు

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర నేపథ్యంలో భక్తులు మేడారానికి పోటెత్తారు. వారాంతం కావడంతో కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఛత్తీస్‌గఢ్‌‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు.

తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలు సమర్పించారు. ఎత్తు బెల్లం (బంగారం), ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను అమ్మవార్లకు సమర్పించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.  

మరోవైపు ఈనెల 24 నుంచి 27 వరకు జరగబోయే మేడారం చిన్న జాతర (మండెమెలిగే పండగ)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో భాగంగా నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను అర్చకులు నిర్వర్తించనున్నారు.

జాతరలో మొదటి రోజైన 24న సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల ఆలయాన్ని శుద్ధి చేయడంతో పాటు గ్రామ ద్వార స్తంభాలను స్థాపించనున్నారు. 25న అమ్మవార్లకు పసుపు, కుంకుమతో అర్చన చేయనున్నారు.

26న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. చివరి రోజైన 27 నాడు సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం జాతర ముగిసినట్లు అర్చకులు ప్రకటిస్తారు.

click me!