సిద్దిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడిని నోటికొచ్చిన బూతులు తిడుతూ, కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ ఓ గ్యాంగ్ అమానుషంగా వ్యవహరించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అనంతసాగర్ గ్రామానికి చెందిన రవీందర్ తన వద్దగల రెండు లేగదూడలను అమ్మకానికి పెట్టాడు. వీటిని కుకునూరుపల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన దళిత యువకుడు రాజు రూ.19 వేలకు కొనుగోలు చేసారు. వెంటనే రూ.14 వేలు ఇచ్చేసి మిగతా రూ.5 వేలు తర్వాత ఇస్తానని చెప్పి లేగదూడలు తీసుకుని వెళ్లిపోయాడు రాజు. అయితే లేగదూడలు తీసుకుని చాలారోజులు అవుతున్నా రాజు రూ.5వేలు ఇవ్వకపోవడంతో రవీందర్ ఆగ్రహించాడు. సోదరుడితో కలిసి అనంతసాగర్ బస్టాండ్ వద్ద రాజును పట్టుకున్న రవీందర్ గొడవకు దిగాడు.
డబ్బుల గురించి రాజును నిలదీసి నోటికొచ్చినట్లు తిట్టడం ప్రారంభించాడు రవీందర్. మాటామాటా పెరగడంతో రవీందర్ తో పాటు అతడి వెంటవచ్చిన మరో ముగ్గురు రాజుపై దాడిచేసారు. బూతులు తిడుతూ కర్రలతో చితకబాదినట్లు బాధితుడు రాజు వెల్లడించాడు. వెంటనే జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాజు తనపై జరిగిన దాడిగురించి పోలీసులకు తెలిపాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More హైదరాబాద్ : ప్రియుడి మోజుల్లో కట్టుకున్నోడి దారుణ హత్య... క్వాటర్ లో విషం కలిపి తాగించి..
రాజుపై దాడిచేసిన రవీందర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సాగుతున్న దాడులను నియంత్రించాలని పోలీసులను కోరారు. గ్రామాల్లో దళితులపై ఇంకా చిన్నచూపు కొనసాగుతోందని... కుల దురహంకారంతో దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.