Munugode Bypoll 2022: పోటీపై మహాసభల తర్వాత నిర్ణయం తీసుకోనున్న సీపీఐ

Published : Aug 12, 2022, 04:44 PM ISTUpdated : Aug 12, 2022, 04:53 PM IST
 Munugode Bypoll 2022: పోటీపై మహాసభల తర్వాత  నిర్ణయం తీసుకోనున్న సీపీఐ

సారాంశం

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే విషయమై నిర్ణయాన్ని పార్టీ మహాసభల తర్వాత నిర్ణయం తీసుకొంటామని సీపీఐ నేతలు చెబుతున్నారు. సీపీఐ నేతలు చండూరులో ఇవాళ సమావేశమయ్యారు.   

నల్గొండ: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  పార్టీ మహాసభలు పూర్తైన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సీపీఐ నేతలు చెబుతున్నారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చండూరులో సీపీఐ నేతలు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మహాసభలతో పాటు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక విషయమై పార్టీ నేతలు చర్చించారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ అభ్యర్ధులు పలుమార్లు విజయం సాధించారు.  సీపీఐ లేదా కాంగ్రెస్ అభ్యర్ధులే ఈ స్థానం నుండి విజయం సాధించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో పోటీ విషయమై సీపీఐ నేతలు చర్చిస్తున్నారు. 

also read:నా రాజీనామాతో మునుగోడు ప్రజల డిమాండ్లు నెరవేరుతున్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సీపీఎంతో కూడా చర్చిస్తామని సీపీఐ నేతలు చెబుతున్నారు.ఈ నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈ స్థానంలో  లెఫ్ట్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తాయా లేదా  కలిసి పోటీ చేస్తాయా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తాయా లేదా ఏదైనా పార్టీకి మద్దతును ఇస్తాయా అనే విషయమై కూడా ఆ పార్టీలు నిర్ణయించుకోలేదు. ఈనియోజకవర్గంలో పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని పార్టీ మహాసభల తర్వాత ప్రకటించనున్నట్టుగా సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు 

గతంలో  రాష్ట్రంలో నాలుగు స్థానాలకు  జరిగిన ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేయలేదు.  ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాయా లేదా అనేది త్వరలోనే తేలనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 8వ తేదీన రాజీనామా చేశారు.ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు.  దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. 

బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్ పార్టీలు ఇతర పార్టీలకు మద్దతిస్తాయా లేదా పోటీ చేస్తాయా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఈ స్థానం నుండి ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న పల్లా వెంకట్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై  పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఒకవేళ ఈ స్థానం నుండి సీపీఐ పోటీ చేస్తే నెల్లికంటి సత్యంను బరిలోకి దింపే అవకాశంలేకపోలేదు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu