టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ నేతల అభిప్రాయ సేకరణలో శనివారం నాడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ నేతల అభిప్రాయ సేకరణలో శనివారం నాడు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో కొత్త పీసీసీ చీప్ అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. శనివారం నాడు చివరి రోజున కూడ కొందరి నుండి అభిప్రాయాలు తీసుకొన్నారు.
చివరి రోజున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు వేర్వేరుగా ఠాగూర్ ను కలిశారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు మాణికం ఠాగూర్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి కేటాయించాలనే విషయమై నేతలు ఠాగూర్ కు తమ అభిప్రాయాలను విన్పించారు. ఏ కారణంగా ఎవరిని ఈ పదవిని అప్పగించాలనే విషయమై నేతలు తమ వాదనలను విన్పించారు.
also read:టీపీసీసీ చీఫ్ పదవి: రెండో రోజూ నేతల నుండి ఠాగూర్ అభిప్రాయాల సేకరణ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలతో ఠాగూర్ తో భేటీ అయిన కొద్దిసేపటికే మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఠాగూర్ తో సమావేశం కావడానికి గాంధీ భవన్ కు వచ్చారు.రేవంత్ రావడంతో ఠాగూర్ తో భేటీ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలు తమ సమావేశాన్ని ముగించుకొని బయటకు వచ్చారు.
తమ మనసులో అభిప్రాయాలను ఠాగూర్ కు వివరించినట్టుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు.పీసీసీ అధ్యక్ష ఎంపిక విషయంలో మెజారిటీ అభిప్రాయం కాకుండా ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఠాగూర్ కు చెప్పామన్నారు.
అందరికీ ఆమోదయోగ్యమైన నేతనే పీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ నాయకత్వం ఎంపిక చేస్తోందని జగ్గారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.