రెండోసారి అధికారంలోకి వచ్చారు.. వీటి సంగతేంటీ: కేసీఆర్‌కు రేవంత్ లేఖ

By Siva KodatiFirst Published Feb 14, 2021, 8:54 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పింఛన్‌ అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించడం సహా అర్హులైన వారందరికీ పింఛన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండోసారి అధికారం ఇస్తే అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడంతోపాటు అర్హత వయస్సును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ లేఖలో ప్రస్తావించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పింఛన్‌ అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించడం సహా అర్హులైన వారందరికీ పింఛన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రెండోసారి అధికారం ఇస్తే అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడంతోపాటు అర్హత వయస్సును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ తీరు చూస్తే.. ప్రచారం ఎక్కువ పనితనం తక్కువ అన్నట్లుగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఎద్దేవా చేశారు.

ఏళ్లు గడుస్తున్నా హామీల అమలులో ఎలాంటి పురోగతిలేదని రేవంత్ మండిపడ్డారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికీ పింఛన్‌ ఇవ్వాలని ఆయన కోరారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిళలను గుర్తించి తక్షణమే పింఛన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి లేఖలో లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు 

ఆయన ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విషయంలో మీ ప్రభుత్వ తీరు ప్రచారం ఎక్కువ పనితనం తక్కువ అన్నట్లుగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెన్షన్ల విషయంలో మీరిచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదు.

రెండోసారి అధికారం ఇస్తే అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడంతో పాటు, పెన్షన్ల అర్హత వయస్సును 60 నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తవుతున్నా మీ హామీకి అతీగతీ లేదు.

‘రాజీవ్ రైతు భరోసా’ పేరుతో పాదయాత్రగా నేను నిత్యం వేలాది మంది జనాలను కలుసుకుంటున్నప్పుడు వాళ్లు అనేక సమస్యలు, మీ హామీల ఉల్లంఘనలు నా ద్రుష్టికి తెస్తున్నారు. ఈ క్రమంలో పెన్షన్లకు సంబంధించి చాలా మంది నా ద్రుష్టికి తెచ్చిన సమస్యను ఈ లేఖ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది పెద్దవారు, ఒంటరి మహిళలు పెన్షన్‌కు అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గిస్తామన్న మీ హామీ అమలు చేయకపోవడం వల్ల లక్షలాది మంది అర్హులు గత రెండేళ్లుగా పెన్షన్‌కు దూరమయ్యారు.

ఈ రెండేళ్లలో భర్తలను కోల్పోయిన ఒంటరి ఆడబిడ్డల విషయంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇంట్లో పెన్షన్‌కు అర్హులైన ఇద్దరు పెద్దవారు ఉంటే ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. ఇద్దరిలో పెన్షన్ పొందుతున్న వారు చనిపోతే కనీసం ఆ సందర్భంలోనైనా మిగిలిన ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం లేదు.

రెండేళ్లుగా పెన్షన్‌కు అర్హులైనవారు, ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారన్న ఎన్యుమరేషన్ జరగలేదు. దీంతో చాలా మంది అర్హులైన వారు పెన్షన్లు పొందలేక నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. అర్హులందరికీ పెన్షన్ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.

click me!