
MLA Seethakka Fires on Vijayasai Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతున్న క్రమంలో వివిధ పార్టీల నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ సీపీ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు విజయ సాయి రెడ్డిపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని విజయ సాయి రెడ్డి కాదు.. దొంగసాయి రెడ్డి అని పిలుస్తారంటూ మండిపడ్డారు. మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ బూట్లు నాకుతున్నారని ఘాటుగా స్పందించారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన సీతక్క.. "మీ అవినీతి కేసుల నుండి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి ఢిల్లీలో boot foolish చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థించాము, కాని మీరు బీజేపీ బూట్లు నాకాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి నుండి మిమ్మల్ని విజయసాయి రెడ్డి కాదు.. దొంగ సాయిరెడ్డి అని పిలుస్తారు" అని సీతక్క ఫైర్ అయింది.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతున్నారు. తన సోదరి ప్రియాంకా గాంధీ తోడుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీస్కు బయలుదేరారు. అయితే, వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోడుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసుకు వెళ్లిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. విమర్శలు గుప్పించారు. కర్మ ఫలం ఎక్కడికి పోతుంది అన్నట్లుగా అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనానికి రాహుల్ గాంధీ ముఖం చూపించలేకపోతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత అసలు జనంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవసరమవుతుందేమోనంటూ మరో కామెంట్ చేశారు.
ఇక విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ దుమారమే రేపుతోంది. ఈ ట్వీట్ను చూసినంతనే నెటిజన్లు సాయిరెడ్డిపై ట్రోలింగ్ మొదలెట్టారు. ఏ అర్హత ఉందని రాహుల్ గాంధీని ఇలా విమర్శిస్తున్నారంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. 'ఎందుకైనా మంచిది, మీరు ఓ డజన్ పీపీఈ కిట్లు దగ్గర పెట్టుకోండి' అంటూ ఆ నెటిజన్ సాయిరెడ్డిపై పంచ్ సంధించారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు విజయసాయి రెడ్డిపై తీవ్రంగానే స్పందిస్తున్నాయి.