కేసీఆర్..మా ముగ్గురిని టార్గెట్ చేశారు...సంపత్

By ramya neerukondaFirst Published Sep 29, 2018, 2:37 PM IST
Highlights

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేవంత్ కి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు  చేయించారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేవంత్ కి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ నెల 18, 19 తేదీల్లో పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులను కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలుచుకుని ఏకాంతంగా మాట్లాడినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ఆ కుట్రలో భాగంగానే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్, సంపత్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవకూడదని పోలీస్ అధికారులకు కేసీఆర్ ఆదేశాలిచ్చినట్లు తెలిసిందన్నారు. మా ముగ్గురి నేతలపై కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశం టైమ్స్ నౌ పత్రికలో కూడా వచ్చిందని స్పష్టం చేశారు.
 
తమ మీద పోలీస్ అధికారులను, ఏ సంస్థలనైనా ఉసిగొలిపితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఏ స్థాయికైనా వెళ్తామని సూచించారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వ పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. దేవుడ్నే ఎదిరిస్తామని టీఆర్ఎస్ నేతలు కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటోళ్లను దేవుడు కూడా క్షమించడని చెప్పారు. టీఆర్ఎస్ పాలనను అంతం చేసే వరకూ పోరాటం చేస్తామని సంపత్ శపథం చేశారు.

click me!