రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు: వీహెచ్ మీద కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

Published : Dec 26, 2020, 11:21 AM IST
రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు: వీహెచ్ మీద కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

సారాంశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో సీనియర్ నేత విహెచ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందించింది. విహెచ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. విహెచ్ చేసిన వ్యాఖ్యలపై నివేదిక పంపించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ కార్యదర్శి బోసురాజును ఆదేశించారు. దీంతో బోసురాజు వీడియో క్లిప్పింగులను, వార్తాపత్రికల కట్టింగ్స్ ను అధిష్టానానికి పంపించారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో విహెచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. మాణిక్యం ఠాగూర్ డబ్పులకు అమ్ముడుపోయారని కూడా విహెచ్ ఆరోపించారు. దీంతో విహెచ్ కు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావుకు బెదిరింపులు వస్తున్నాయని విహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తామంటూ తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని విహెచ్ తన ఫిర్యాదులో చెప్పారు. తనను అసభ్యకరంగా దూషించారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై ఆయన శుక్రవారం ఉదయం తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి ఇస్తే తాను పార్టీలో ఉండబోనని విహెచ్ అన్నారు. తనతో పాటు ఇతర నాయకులు కూడా వారి దారి వారు చూసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేకి రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 

రేవంత్ రెడ్డికే కాదు తనకు కూడా ప్రజల్లో క్రేజ్ ఉందని చెప్పారు రాష్ట్రంలో బిజెపి పుంజుకుంటున్న స్థితిలో ఆర్ఎస్ఎస్ వ్యక్తికి పిసీసీ పదవి ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ వ్యక్తి కింద తాను పనిచేయబోనని చెప్పారు.

రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని తాను సీబీఐకి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. రెడ్లకే పీసీసీ పదవి ఇవ్వాలని అనుకుంటే ఒరిజినల్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu