
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటల తర్వాత సుదర్శన యాగం నిర్వహించనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి చేస్తారు.
ఆ తర్వాత నూతన సచివాలయాలన్ని కేసీఆర్ ప్రారంభించి, నేరుగా 6వ అంతస్తులో వున్న తన ఛాంబర్లో అడుగుపెడతారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 గంటల మధ్య మంచి ముహూర్తం వుండటంతో ఆ రోజున అధికారులు తమకు కేటాయించిన చాంబర్లలో అడుగుపెడతారు. ఈ సమయంలోనే ఒక ఫైల్ మీద సంతకం చేయాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి మంత్రులు, అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అనంతరం 2.15 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొంటారని సమాచారం. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి సుమారు 2500 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున కొత్త సచివాలయంలో పలు భద్రతా చర్యలు చేపట్టారు.
ALso Read: ఇంద్రభవనంలా తెలంగాణ కొత్త సచివాలయం.. ఏప్రిల్ 30న ప్రారంభం
సెక్రటేరియట్ కు నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలు ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఉత్తర, పడమర గేట్లను తెరుస్తారు. సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారులు ఈశాన్య ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారు. ఆగ్నేయ ద్వారం సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, ముఖ్య ఆహ్వానితులు, విదేశీ అతిథులకు మాత్రమే తూర్పు ద్వారం (మెయిన్ గేట్)ను ఉపయోగిస్తారు.
వికలాంగులు, వృద్ధుల కోసం ఎలక్ట్రికల్ వాహనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సచివాలయంలోకి ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రయివేటు వాహనాలకు అనుమతి లేదుని పేర్కొన్నారు. సెక్రటేరియట్ భద్రతకు సంబంధించి డీజీపీ విధివిధానాలను రూపొందించి భద్రతా చర్యలు తీసుకుంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.