
CM KCR: వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్)లను వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని, వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వీఆర్ఏలతో సమావేశమై.. వారితో చర్చించి అభిప్రాయాలను సేకరించాలనీ, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను.. మంత్రి కె.టి.రామారావు ఆధ్వర్యంలో మంత్రులు జి. జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని సీఎం ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉప సంఘం వీఆర్ఏ లతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోని వీఆర్ఎ ల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉప సంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారంలోపు పూర్తి కావాలని ఆదేశించారు.