
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్న వీడకుండా బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎల్పీ నేత భటి విక్రమార్క అన్నారు. రాజ గోపాల్ రెడ్డి పార్టీలో ఉండేలా కృషి చేస్తామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడుతుందని.. తాము కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. పార్టీలో ఆయనకు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని పరిష్కారించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. తాను కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడానని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించే బలం కాంగ్రెస్ కే ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఎవరికి, దేనికి భయపడదని అన్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్లో వరద కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రజల కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏం జరగుతుందని ప్రశ్నించారు.
ఎనిమిదేళ్ల రాష్ట్ర ఆదాయం, అప్పు మొత్తం కాళేశ్వరానికే ఖర్చు చేశారని... వరదకు మొత్తం అది మునిగి పోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు ఎవరైనా వెళతాం అంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సీఎల్పీ బృందంతో కలిసి కాళేశ్వరం వెళనున్నట్లు తెలిపారు. తమను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. వరదల వల్ల జరిగిన నష్టంపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ఇంకా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.