
నల్గొండ జిల్లాలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ మృతిచెందినట్టుగా ప్రచారం జరిగినప్పటికీ.. ఒక్కరే మృతిచెందినట్టుగా అధికారులు తెలిపారు. మతురాలిని తమిళనాడుకు చెందిన మహిళా పైలట్ మహిమగా గుర్తించారు. పొలాలకు మధ్యలో హెలికాప్టర్ కుప్పకూలడంతో అక్కడికి సమీపంలో ఉన్న కూలీలు, రైతులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. హెలికాప్టర్ కూలుతున్న దృశ్యాలను గమనించిన అక్కడివారు.. దూరంగా పరుగులు తీశారు. నాగర్జున సాగర్ డ్యామ్కు కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనకు సంబంధించి స్థానికులు అధికారులు సమాచారం అందించారు. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు, వైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోయే సమయంలో దట్టమైన మంటలు చూశామని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైనీ హెలికాప్టర్ వేగం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా వారు స్థానికులు తెలిపారు. అయితే హెలికాప్టర్ కుప్పకూలడానికి కారణాలను అధికారులు పరిశీలన తర్వాతే వెల్లడికానుంది. ఇక, కుప్పకూలిన హెలికాప్టర్ను ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీకి చెందినదిగా గుర్తించారు. "
ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. శిక్షణలో ఉన్న హెలికాప్టర్ కుప్పకూలినట్టుగా స్థానికులు సమాచారం అందినట్టుగా తెలిపారు. ఫ్లైట్లో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించినట్టుగా వెల్లడించారు. లోపల ఇంకెవరైనా ఉన్నారో చూడాల్సి ఉందన్నారు. మిగిలిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు.