పోలింగ్ బూత్‌లకు మొబైల్స్‌తో వెళ్లకండి

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 9:47 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే కొంతమంది ఓటర్లకు నిబంధనలపై అవగాహన లేకపోవడంతో వారు మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే కొంతమంది ఓటర్లకు నిబంధనలపై అవగాహన లేకపోవడంతో వారు మొబైల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెల్‌ఫోన్లతో పోలింగ్ బూత్‌కు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

బూత్‌కు బయట మొబైల్స్‌ను దాచే సౌకర్యం లేకపోవడంతో పలువురు ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఈసీ ఏర్పాట్లపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని తెలిపిన అధికారులు...కనీసం వాటికి డిపాజిట్ సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు.

మరోవైపు బంజారాహిల్స్ పోలింగ్ స్టేషన్‌లో దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలోని 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.  దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

click me!