ప్రవాస భారతీయుడికి ఎనిమిది కోట్లు టోకరా.. కుమార్ వర్మ కేసులో వెలుగులోకి మరో మోసం....

Published : Mar 10, 2022, 12:31 PM IST
ప్రవాస భారతీయుడికి ఎనిమిది కోట్లు టోకరా.. కుమార్ వర్మ కేసులో వెలుగులోకి మరో మోసం....

సారాంశం

ప్రవాసభారతీయుడి నుంచి ఎనిమిది కోట్లు స్వాహా చేసిన కేసులో ఓ వ్యాపారవేత్తను ఐదు రోజులక్రితం అరెస్ట్ చేశారు. ఆయన కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మణికొండకు చెందిన ఓ వ్యాపారవేత్తను కోటిన్నర మోసం చేశాడు. 

హైదరాబాద్ : ప్రవాస భారతీయుడు నుంచి రూ. ఏడు కోట్లు, మణికొండ వాసి నుంచి రూ.1.78 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుడు కుమార్ శ్రీనివాస్ పెనుమత్స వర్మ అలియాస్ కుమార్ వర్మ మరో దందా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్ గూడ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ను కోటి మేర మోసం చేసినట్లు జూబ్లీహిల్స్ ఠాణాలో ఆయన మీద కేసు నమోదయింది. యూసుఫ్ గూడ ప్రాంతానికి చెందిన సదరు క్లాస్‌-1 కాంట్రాక్టర్ 2015 తర్వాత కాంట్రాక్టులకు దూరంగా ఉంటున్నారు.

ఆయనకు ఓ స్నేహితుడి ద్వారా కుమార్ వర్మ పరిచయమయ్యాడు. తాను పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తుంటానని, ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన మనుషులను సరఫరా చేయాల్సిందిగా కుమారవర్మ కోరడంతో బాధితుడు అంగీకరించాడు. తొలి నెల రోజులు చేసే పనులన్నీట్రైనింగ్ కిందికి వస్తాయని, ఆ తర్వాత డబ్బులు చెల్లిస్తానని కుమార్ వర్మ చెప్పగా ఆయన అంగీకరించాడు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లు ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లతోపాటు చెన్నైలోనూ పలు పనులు చేయించారు. ప్రతి నెలా దాదాపు రూ. 6 లక్షల చొప్పున 20 లక్షల వరకు బాధితుడు మనుషులకు చెల్లించాడు.

ఈ కాలంలో కేవలం కొంత మాత్రమే బిల్లుల రూపంలో కుమార్ వర్మ చెల్లించాడు. ఇదిలా ఉండగా 2020లో లాక్ డౌన్ అమలులోకి రావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత తాను పూర్తిగా నష్టపోయానంటూ చెప్పిన కుమార్ వర్మ అప్పటివరకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేను అన్నాడు. ఆపై చేసే పనులకు మాత్రం ప్రతి నెలా చెల్లిస్తానంటూ బాధితుడితో మరికొన్ని పనులు చేయించాడు.

మొత్తం రూ.కోటికి పైగా పనులు చేయించిన తర్వాత కూడా కేవలం రూ.17లక్షలే చెల్లించాడు. మిగిలింది ప్రవాస భారతీయుడు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇస్తానన్నాడు. కొన్నాళ్ళకు బాధితుడు ఆరాతీయగా ప్రవాస భారతీయుడు నుంచి ఏడు కోట్లు స్వాహా చేశాడని వివిధ పనులకు సంబంధించిన మొత్తం నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయుడి కేసులో కుమార్ వర్మ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఇతడిని అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో వర్మతో పాటు అనూష రాజ్, నాగేంద్ర మహేష్ జనార్ధన, కర్ణ మహేంద్ర రాజ్,  అకౌంటెంట్ ప్రసన్నకుమార్ సైతం నిందితులుగా ఉన్నారు. వీరి పాత్రపై ఈఓడబ్ల్యూ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు అందుబాటులో లేరని పోలీసులు పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?