
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయరా... 2019 లో టీఆర్ఎస్ తరఫున ఆయన సీఎం అభ్యర్థిగా బరిలో ఉండరా... అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్.
డాక్టర్ గా ఆ తర్వాత డాక్టర్ జేఏసీ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ కండువాను కప్పుకొని తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. భువనగిరి ఎంపీగా టీఆరఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు.ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా ఢిల్లీలో పార్టీ వాణిని బాగానే వినిపిస్తున్నారు.
2019 ఎన్నికల్లో కేసీఆర్ ఇక సీఎం అభ్యర్థిగా ఉండరని జోస్యం చెప్పారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో సీఎం ఎవరు అనేది కేసీఆరే చెబుతారని పేర్కొన్నారు.
ఎన్నికలు ఎదుర్కోడానికి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ, బూర మాత్రం అప్పుడే కేసీఆర్ గురించి వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే కేసీఆర్ అనుమతి లేకుండా బూర ఈ వ్యాఖ్యలు చేశారా... లేకుంటే అధినేత సూచనలతోనే మీడియాకు ఓ హింట్ ఇచ్చారా అనేది తెలియడం లేదు.
కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీలో అధినేతకు ఎంతో చనువుగా ఉండే నేతలు కూడా చేయని ఓ వ్యాఖ్యను ఈ డాక్టర్ ఎంపీ చేయడం.
వచ్చే ఎన్నికల్లో సీఎం పదవిని కేటీఆర్ కు కట్టబెట్టి ఢిల్లీ వైపు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఇప్పటికే ఓ టాక్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు బూర వ్యాఖ్యలు దానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అయితే గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అవుతారని ఘంటా పథంగా చెప్పారు. తీరా అధికారం వచ్చాక దళితులతో ప్రతిపాదించి తానే సీఎం పీఠం ఎక్కారు.
మరి ఈ సారి డాక్టర్ జోస్యం నిజమవుతుందా... లేక కేసీఆర్ మరో ప్రతిపాదనతో మళ్లీ సీఎం పీఠం ఎక్కుతారా అనేది తెలియాలంటే 2019 వరకు ఆగాల్సిందే.