ఢిల్లీకి పాకిన కేసీఆర్ అవినీతి.. త్వరలో ఇంటికే : వరంగల్ సభలో జేపీ నడ్డా వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 27, 2022, 5:46 PM IST
Highlights

వరంగల్‌లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్ సభను అడ్డుకోవడానికి కుట్ర చేశారని.. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ఆయన ఆరోపించారు. 
 

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజా సంగ్రామ యాత్ర సంకల్పమన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని నడ్డా పేర్కొన్నారు. మూడు విడతల్లోనూ బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అని.. తెలంగాణలో వెలుగులు నింపడానికే ఆయన పాదయాత్ర నిర్వహించారని నడ్డా తెలిపారు. 

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అధికారంలో వుందని.. త్వరలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెడతారని జేపీ నడ్డా జోస్యం చెప్పారు. అవినీతి పాలనతో తెలంగాణను దోచేస్తున్నారని.. రాష్ట్రంలో నయా నిజాం వచ్చారని ఆయన పేర్కొన్నారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్ తన ఏటీఎంలా మార్చుకున్నారని.. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు మొదట అండగా నిలిచింది బీజేపీయేనని.. తాము అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. మజ్లిస్ భయంతో కేసీఆర్ విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. వరంగల్ సభను అడ్డుకోవడానికి కుట్ర చేశారని.. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ఆయన ఆరోపించారు. 

click me!