కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఈ ఛానెల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకొంటానని ఆమె ప్రకటించారు.
హైదరాబాద్: కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఈ ఛానెల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకొంటానని ఆమె ప్రకటించారు.
గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవని ఏ హీరోనూ తాను సమర్థించనని తాను అన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాననివిజయశాంతి తెలిపారు.
కొందరు నటులను, కొన్ని సినిమాలను విజయశాంతి ప్రశంసించినట్టు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారంపై విజయశాంతి ఫేస్బుక్ ద్వారా స్పందించారు. ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు కొన్ని సందర్భాలలో విమర్శించినట్టు పలు యూట్యూబ్ ఛానెళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.
తెలంగాణలో ఆయా సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందామన్నారు. తాను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తానని ఆమె స్పష్టం చేశారు.
నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్థించని ఏ హీరోకూ, వారి సినిమాలకూ నేను మద్దతివ్వను. నేడు కేసీఆర్గారు ఒక అవగాహనతో సమర్థిస్తున్న తీరులో నేను మాట్లాడటం ఎప్పటికీ జరగదని ఆమె తేల్చి చెప్పారు.