
ప్రముఖ సినీ నటి జయప్రద.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు తెలుగు రాజకీయాల్లో పోటీ చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు. స్వతహాగా తెలుగు మహిళ అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని.. తమ పార్టీ అదిష్టానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు.
సోమవారం ఆమె హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఓ క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు.