ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య... గుత్తికోయలపై బహిష్కరణ వేటు, బెండాలపాడు గ్రామస్తుల తీర్మానం

By Siva KodatiFirst Published Nov 26, 2022, 4:54 PM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూముల వివాదంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు కారణమైన గుత్తికోయలపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు బెండాలపాడు గ్రామస్తులు. గుత్తి కోయల వల్ల తమకు ప్రాణ హాని వుందని వారు ఆరోపిస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూముల వివాదంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు బాధ్యులైన ఎర్రబోడు గుత్తికోయలను ఊరి నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామపంచాయతీ తీర్పు వెలువరించింది. గుత్తి కోయల వల్ల తమకు ప్రాణ హాని వుందని అందువల్ల వారిని స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బెండాలపాడు గ్రామస్తులు పంచాయితీ ఈవోకు తీర్మానం కాపీని అందజేశారు. 

కాగా... ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు ముందు ఏం జరిగింది..? అక్కడ పరిస్ధితి ఎలా వుంది..? ఈ వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు అటవీశాఖ అధికారులు. హత్యకు ముందు శ్రీనివాసరావు చుట్టూ దాదాపు పాతిక మంది గుత్తికోయలు వున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వారి చేతుల్లో వేట కొడవళ్ల లాంటి పదునైన ఆయుధాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన చిత్రాల్లో గుర్తించారు. శ్రీనివాసరావుపై దాడి చేసిన గుత్తికోయలు తీవ్రంగా గాయపరిచారు. ఇతర అటవీ శాఖ అధికారులు తేరుకుని ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లే లోగానే శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. 

ALso REad:ఆయుధాలు ఇవ్వాలి: రేపటి నుండి ఫారెస్ట్ సిబ్బంది విధులు బహిష్కరణ

మరోవైపు.. విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాస రావు(45) అంత్యక్రియలు నవంబర్ 23న పూర్తయ్యాయి. పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయిల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపుడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. 

ఇదిలావుండగా... చాలా  కాలంగా  తమకు  ఆయుధాలివ్వాలని పారెస్ట్  అధికారులు  డిమాండ్  చేస్తున్నారు. అడవిలో విధులు నిర్వహించాలంటే  ఆయుధాలు కావాలని కోరుతున్నారు. అయితే  ఈ  విషయమై  ప్రభుత్వం నిర్ణయం  తీసుకోలేదు. రాష్ట్రంలోని పలు  ఏజెన్సీ ప్రాంతాల్లో  ఆదీవాసీలకు , ఫారెస్ట్  సిబ్బంది మధ్య  వివాదాలు జరుగుతున్నాయి.  

click me!