బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఏటిఎంల పరిస్థితి ఏంటి?

By ramya neerukondaFirst Published Dec 26, 2018, 10:04 AM IST
Highlights

 ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవలు వరసగా వచ్చాయి. దీనికి తోడు.. బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మె మొదలుపెట్టారు. 


వరసగా రెండు, మూడు రోజులకు బ్యాంక్ లకు సెలవలు వస్తేచాలు.. ఏటీఎంలలో కూడా డబ్బులు దొరకక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవలు వరసగా వచ్చాయి. దీనికి తోడు.. బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మె మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. నగదు కొరత ఏర్పడుతుందేమోననే భయం నగరవాసులకు పట్టుకుంది. కాగా.. దీనిపై సంబంధిత అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు.

వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె వల్ల నగదు కొరత ఏర్పడకుండా ఖాతాదారుల కోసం ఏటీఎంలలో  డబ్బులు పెట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో 3,969 ఏటీఎంలుండగా వీటిలో 85 శాతం ఏటీఎంలలో నగదు ఉంచామని అధికారులు చెప్పారు.

 హైదరాబాద్ నగరంతోపాటు గ్రామాలు, పట్టణప్రాంతాల్లోని ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. వరుస సెలవులతో పాటు బ్యాంకు ఆఫ్ బరోడా, విజయాబ్యాంకు, దేనాబ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. 

దీంతోపాటు క్రిస్మస్, ఇతర సెలవులతో ఖాతాదారులకు నగదు కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏటీఎంలలో నగదును నింపామని వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు వివరించారు.

click me!