
సీఎం కేసీఆర్కు (CM KCR) రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో సీఎంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. శ్వేత సౌధంలో సేద తీరితే సరిపోదని, రాష్ట్ర ప్రజల, ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లేఖ రాశారు.
ఆ లేఖలో ఇలా పేర్కొన్నారు. గత 6 రోజులుగా రాష్ట్రంలోని 9350 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ అత్యంత సమంజసమైనదని అన్నారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండదని అసెంబ్లీ సాక్షిగా మీరే (సీఎం కేసీఆర్ ) ప్రకటించారని తెలిపారు.
కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం నాడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సంతకం చేసినట్టు వార్తలొచ్చాయనీ, కానీ పోటీ పరీక్షల్లో రాసి అర్హత సాధించి ఉద్యోగంలో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మాత్రం రెగ్యులరైజ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీ కాలం పూర్తయి నాలుగేళ్లు దాటిందనీ, వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమన్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించినప్పటికీ అన్నింటినీ భరిస్తూ వారు విధులు నిర్వర్తించారనీ, గడువు దాటినా నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని మండి పడ్డారు.
పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకుంటున్న ప్రభుత్వం అందులో కీలక పాత్ర వహిస్తున్న ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులైన నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, కిచెన్ గార్డెన్ లతోపాటు పల్లె ప్రగతి, హరితహారం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలులో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు.
వారు రోజుకు 12 గంటలకుపైగా పని చేస్తున్నారనీ, వారితో వెట్టిచాకిరి చేయించుకోవడమే తప్ప నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకం వల్ల .. వారు చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలై సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటున్నారనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం క్షమించదని , వారి పక్షనా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చారించారు.