
ఆదిలాబాద్ : సొంత కుటుంబసభ్యులే తమ ఆలనాపాలన మరిస్తే సీఎం కేసీఆర్ తమకు పెద్దకొడుకులా మారి పింఛన్ ఇస్తున్నారని వృద్దులు అంటుంటారు. అలాగే ఒంటరి మహిళలు, వికలాంగులతో పాటు ఆసరా పింఛన్ అందుకునేవారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తుండటం గమనిస్తుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పించన్ దారుల ఏకపక్షంగా బిఆర్ఎస్ పార్టీకే ఓట్లేయడంతో ఆ పార్టీ మెజారిటీ సాధించిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈసారి కూడా పించన్ దారుల మద్దతు కేసీఆర్ కే లభించేలా కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నామినేషన్ కోసం తమ పించన్ డబ్బులు విరాళంగా ఇచ్చి మద్దతు ప్రకటించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు పించన్ దారులు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామానికి చెందిన 100 మంది పించన్ దారులు కేసీఆర్ నామినేషన్ కోసం పించన్ డబ్బులు విరాళంగా ప్రకటించారు. ఒక్కొక్కరు వెయ్యి రూపాయల చొప్పున వందమంది కలిపి లక్ష రూపాయలు జమచేసారు.ఇలా తమ పించన్ డబ్బులను జమచేసి గ్రామ సర్పంచ్ మీనాక్షికి అందజేసారు. ఈ డబ్బులను కేసీఆర్ కు అందజేయాలని పించన్ దారులు సర్పంచ్ ను కోరారు.
Read More BRS: బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతున్న సొంత నాయకుల వ్యాఖ్యలు !
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఆసరాగా నిలిచారని... పెద్ద కొడుకులా మారి నెల నెలా పించన్ అందిస్తున్నారని అన్నారు. ఇప్పటికే అందిస్తున్న పించన్లను మరింత పెంచుతామని ఇటీవల హామీ కూడా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. తమకు ఆసరాగా నిలిచిన కేసీఆర్ కు ఎన్నికల సమయంలో తాము ఆసరాగా నిలవాలని అనుకుంటున్నామని... అందుకోసమే ఆయన నామినేషన్ కోసం తమ పించన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నామని ముఖరం కె గ్రామానికి చెందిన పించన్ దారులు తెలిపారు.