
హైదరాబాద్: ప్రధానికి ముందుచూపు లేకపోవడం వల్లే దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. కరోనా కేసుల ఉధృతిని తగ్గించేందుకుగాను ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రతి ఒక్కరూ మాస్కు వాడడంతో పాటు బౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.గత 24 గంటల వ్యవధిలో 73,275 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 6,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు కరోనాతో గత 24 గంటల వ్యవధిలో 43 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 65,597కి చేరుకొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1416 కేసులు రికార్డయ్యాయి.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.