Raja Singh: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్య‌ర్థి రాజాసింగ్ పై మ‌రో కేసు న‌మోదు.. ఎందుకంటే..?

Mahesh RajamoniPublished : Nov 16, 2023 11:44 PM

Goshamahal MLA Raja Singh: “ఈ ఎన్నికలు నాకు జీవన్మరణ సమస్య అని మర్చిపోవద్దు. నేను చనిపోవడానికి భయపడను.. చంపడానికి భయపడను” అని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్య‌ర్థి రాజా సింగ్ చేసిన సంచలన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.   

Telangana Assembly Elections 2023: గోషామ‌హ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి, ఎమ్మెల్యే రాజాసింగ్ పై మ‌రో కేసు న‌మోదైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొడుతూ వ్యాఖ్య‌లు చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదైంది. సంబంధిత వివ‌రాల ప్ర‌కారం.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మహరాజ్‌గంజ్‌లో జరిగిన ఎన్నికల సభలో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గోషామహల్ బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు.

రాజా సింగ్‌పై సుమో-మోటో చర్యను ప్రారంభించిన మంగళ్‌హాట్ పోలీసులు ఆర్పీ చట్టం (ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 1951) సెక్షన్ 125 కింద బుధవారం (నవంబర్ 15) కేసు నమోదు చేశారు. మహరాజ్‌గంజ్‌లోని అగర్వాల్ భవన్‌లో రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని ఆరోపిస్తూ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ షేక్ అస్లాం ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత రాజా సింగ్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హిందీలో మతపరమైన ప్రసంగం చేశాడని క్యాప్షన్‌తో 51 సెకన్ల నిడివి గల వీడియో ఉందని ఎస్‌ఐ తెలిపారు. రాజాసింగ్ త‌న ప్ర‌సంగంలో ల‌వ్ జిహాదీలు, హిందూ కుమార్తెల మ‌ధ్య పోరాటం అంటూ రెచ్చ‌గొట్టే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌ని పేర్కొన్నారు.

ఇదిలావుండ‌గా, గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇస్తూ తన క్యాడర్ లో ఎవరైనా చొరబాటుదారులను కనుగొంటే చంపడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తమ పార్టీలో ఎవరు కోవర్టులుగా పనిచేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ తనకు చెప్పారని రాజాసింగ్ అన్నారు. ఈసారి అలా చేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇక్కడి నుంచి అక్కడకు సమాచారం ఇస్తే అక్కడి నుంచి ఎవరో ఒకరు మీ సమాచారాన్ని ఇక్కడ ఇస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. 'ఈ ఎన్నికలు నాకు జీవన్మరణ సమస్య అనే విషయాన్ని మర్చిపోవద్దు. చావడానికి భయపడను, చంపడానికి కూడా భయపడను' అని రాజాసింగ్ అన్నారు.

Read more Articles on
click me!