
మహిళను కిడ్నాప్ , అత్యాచారం చేసిన కేసులో మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావును ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిగంటల్లోనే ఆయనపై వరుస కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదవ్వగా.. తాజాగా కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరరావు ఫాంహౌస్ లో పనిచేస్తున్న మహిళపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో సీఐపై వరుస కేసులు నమోదవుతున్నాయి. 2018 నుంచి 2021 వరకు సీఐ ఫాంహౌస్లోనే బాధితురాలి భర్త పనిచేస్తున్నాడు.
అయితే సీఐ అరెస్ట్ వెనుక రాజకీయ నేతల హస్తం వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంజారాహిల్స్ నుంచి సీఐ బదిలీ వెనుక కారణమేంటీ... ఒక ల్యాండ్ కేసులో, మరో రియల్ ఎస్టేట్ కేసులోనూ ఇన్స్పెక్టర్ పాత్ర పెద్దలకు నచ్చలేదా..? ఈ నేపథ్యంలో సీఐని ఇరికించే కుట్ర జరుగుతుందా అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
ALso REad:మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. యాక్సిడెంట్ చేశారంటూ మరో కేసు
కాగా.. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
ఫిర్యాదు చేసిన మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు ఇన్స్పెక్టర్ తనను రేప్ చేశారని తీవ్రంగా ఆరోపించింది. దీనికి అడ్డువచ్చిన తన భర్త తలపగులగొట్టారని పేర్కొంది. ఆ తర్వాత తమ ఇద్దరినీ చంపేందుకు పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఇబ్రహీంపట్నంలో వాహనానికి యాక్సిడెంట్ అయ్యిందని, దీంతో తమ ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. ఒక వేళ కారుకు ప్రమాదానికి గురి కాకుండా ఉంటే ఇన్స్ పెక్టర్ తమను ఇద్దరినీ చంపేసి ఎక్కడో పడేసి ఉండేవాడని ఆరోపించారు. ఈ నిజాలు ఎప్పటికీ బయటకు వచ్చేవి కావని అన్నారు. కాగా నిందితుడిపై తెల్లవారుజామున వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది.